Movie Lovers

బన్నీ – ధనుష్ కలయికలో మల్టీస్టారర్.. నిజమేనా?

Share This :

దర్శక ధీరుడు రాజమౌళి మలిచిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో తెలిసిందే. హాలీవుడ్ చిత్రాల్ని సైతం పక్కకు నెట్టి వసూళ్ళల్లో సరికొత్త అధ్యాయానికి తెరతీస్తోంది చిత్రం. ఆ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో మిగతా దర్శకులు.. క్రేజీ హీరోలతో మల్టీస్టారర్స్ తీసేందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ‘పుష్ప’ చిత్రంతో రీసెంట్ గా నేషనల్ వైడ్ గా సెస్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్, రెండు నేషనల్ అవార్డ్స్ కైవసం చేసుకొని మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న తమిళ స్టార్ హీరో ధనుష్ కలయికలో ఈ మల్టీస్టారర్ ఉండబోతున్నట్టు టాక్. మరి ఈ కాంబోని సెట్ చేయబోతున్న దర్శకుడు ఎవరో తెలుసా? రాజమౌళి తర్వాత టాలీవుడ్ లో అజేయదర్శకుడు అనిపించుకున్న కొరటాల శివ.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ చిత్రం తెరకెక్కించి విడుదలకు సిద్ధం చేసిన కొరటాల.. తదుపరి గా యంగ్ టైగర్ యన్టీఆర్ తో రెండో సారి సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు. యన్టీఆర్ 30వ చిత్రంగా విశేషాన్ని సంతరించుకున్న దీని తర్వాత అల్లు అర్జున్ తో ఓ సినిమా తీయబోతున్నారే వార్తలొచ్చాయి. అయితే ఈ సారి ఆయన మల్టీస్టారర్ తీయబోతున్నాడని, బన్నీతో పాటు ధనుష్ కూడా నటించబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ధనుష్ తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. అంతకన్నా ముందు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు అతడు సుపరిచితుడే. బన్నీ ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అందుకే ఈ ఇద్దరితోనూ కొరటాల ఓ భారీ మల్టీస్టారర్ పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.