ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. కృతి సనన్ నాయిక. టీ సిరిస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నయ్యర్ నిర్మాతలు. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. మహా శివరాత్రి సందర్భంగా ‘ఆది పురుష్’ అప్ డేట్ని అందించారు నిర్మాతలు. ఈ చిత్రాన్ని 2023 జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. రామాయణం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్కి అధిక ప్రాధాన్యం ఉంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ప్రపంచంలోని అత్యాధునిక టెక్నాలజీని ఈ సినిమా కోసం ఉపయోగిస్తున్నారు. ఈ చిత్రానికి సచేత్ – పరంపర సంగీతాన్ని అందిస్తున్నారు.