మహిళలు ఎక్కువగా ఉండే ఉమ్మడి కుటుంబంలో వారసుడిగా ఒకే మగాడు ఉంటే.. అతనిపై వారి ఆప్యాయతలు, అనురాగాలు ఎలా వుంటాయనే పాయింట్తో ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రం రూపొందిందని తెలిపారు చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై శర్వానంద్, రష్మిక మందన్న జంటగా.. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ చిత్రం ఫిబ్రవరి 4న విడుదల కాబోతోన్న సందర్భంగా చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి మీడియాకు చిత్ర విశేషాలను తెలిపారు.
ఆయన మాట్లాడుతూ.. ‘‘పడి పడి లేచె మనసు తర్వాత చక్కటి ఫ్యామిలీ సినిమా చేయాలనుకున్నాం. ఆ సమయంలో కిశోర్ దగ్గర కథ ఉందని తెలిసి విన్నాం. మేం ఏదైతే అనుకుంటున్నామో అదే ఈ కథ అనిపించింది. వెంటనే సినిమాను ప్రారంభించాలనుకున్నాం. కానీ రష్మిక, ఖుష్బూ, రాధిక డేట్స్ వల్ల ఆరునెలలు ఆలస్యమైంది. ఉమ్మడి కుటుంబంలోని ఆప్యాయతల కథ కాబట్టి నాకు బాగా నచ్చింది. పది మంది మహిళలు ఉన్న కుటుంబంలో ఒకే ఒక్క వారసుడు ఉంటే అతనిపై ఉన్న ప్రేమతో అతనికి తెలీకుండా ఇబ్బంది పెట్టే సన్నివేశాలు బాగా చూపించాం. ఇవి అందరికీ కనెక్ట్ అవుతాయని చెప్పగలను. మా సినిమా పాయింట్ నచ్చి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒకరకంగా ఇంతమంది నటీనటులతో సినిమా చేయడం సాహసమే అని చెప్పాలి. ఇంతమంది సీనియర్స్తో చేస్తానని అనుకోలేదు. నా కుటుంబ సభ్యులతోనే ఉన్నట్లు అనిపించింది. కిశోర్ తిరుమల వినోదంతోపాటు కుటుంబ విలువలను బాగా ఎలివేట్ చేస్తారు. కిశోర్ అనుకున్న సమయంలో పూర్తి చేయగలడు. అందుకే నటీనటులు డేట్స్ కుదిరాక చేయగలిగాం. కోవిడ్ టైంలోనూ నటీనటుల ప్రోత్సాహంతో పూర్తి చేయగలిగాం. శర్వానంద్తో మాకిది రెండో సినిమా. తను నన్ను నిర్మాతగా కాకుండా సోదరుడిలా ట్రీట్ చేశాడు. ‘పడి పడి లేచె మనసు’ అనుకున్నంతగా ఆడలేదు. అందుకే అప్పటినుంచి మంచి కథతో సినిమా చేద్దామని అనుకున్నాం. సినిమా సక్సెస్ కాకపోయినా బెటర్మెంట్ చేయాలని మరో సినిమా చేశాం. రష్మికను కథ ప్రకారం ఆమె బాగుంటుందని ఎంపిక చేశాం. దేవీశ్రీ ప్రసాద్ నాలుగు పాటలు అద్భుతమైన ట్యూన్ ఇచ్చాడు. మంచి ఆదరణ పొందాయి. ఐదవ పాట కూడా వుంది. అది నేరుగా సినిమాలో చూస్తే మరింత బాగుంటుంది. సినిమాను అమెరికాలో 300 స్క్రీన్స్లో విడుదల చేస్తున్నాం. ఆంధ్ర, తెలంగాణలోనూ ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ఈ చిత్రం కోవిడ్ తర్వాత కుటుంబాలను థియేటర్కు తీసుకు వస్తుందనే నమ్మకం వుంది. ఎందుకంటే ప్రతి కుటుంబంలోనూ పెద్దమ్మలు, చిన్నమ్మలు, బామ్మలు, తల్లిదండ్రులు ఉంటారు. నా కుటుంబంలోనూ ఇటువంటి వారున్నారు. నేనూ కనెక్ట్ అయ్యాను. ఈ సినిమా చూశాక ప్రతివారూ ఎక్కడోచోట కనెక్ట్ అవుతారు. ఈ చిత్రంలో ఫ్యామిలీ డ్రామాతో పాటు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. హీరో హీరోయిన్ల మధ్య జరిగే సన్నివేశాలు వినోదాన్ని పండిస్తాయి. ఇక సత్య, వెన్నెల కిశోర్, ప్రదీప్ రావత్ పాత్రలు మరింత ఎంటర్టైన్ చేస్తాయి.
ప్రస్తుం నాలుగు సినిమాలను చేస్తున్నాను. ప్రొడక్షన్ పరంగా శ్రీకాంత్ సహకారం ఎంతో వుంది. ఏదైనా మన పని మనం నిక్కచ్చిగా చేసుకోవాలి. నిర్మాణంలో పలు విషయాలను నేర్చుకుని ముందుకు సాగుతున్నాను. నిర్మాతగా డ్రీమ్ అనేది ఉంటుంది. మంచి సినిమా చేయడమే ప్రస్తుతం ముందున్నది. నేను చేయబోయే సినిమాలు ఒక్కోటి ఒక్కో భిన్నమైన కథలతో రూపొందుతున్నాయి. రవితేజతో ‘రామారావు ఆన్ డ్యూటీ’ సిన్సియర్ కలెక్టర్ నేపథ్యంలో సాగుతుంది. రానా ‘విరాటపర్వం’ 1945 నక్సల్స్ బ్యాక్డ్రాప్, నాని ‘దసరా’ చిత్రం వినూత్నమైన అంశం. గోదావరిఖని బ్యాక్డ్రాప్ కథ. సెట్ కూడా వేస్తున్నాం..’’ అని తెలిపారు.